సీట్ల ముష్టి కోసం చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్లారు: అంబటి రాంబాబు

  • మేనిఫెస్టోను మాయం చేసిన ఘనుడు చంద్రబాబు అంటూ అంబటి ఎద్దేవా
  • పద్మవ్యూహాలను ఛేదించి రాగల అర్జునుడు జగన్ అని కితాబు
  • బాలశౌరి ఒక బఫూన్ అని విమర్శ
ఏపీ అసెంబ్లీ సమావేశాలు కాసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. అంతకు ముందు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ... టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ లపై విమర్శలు గుప్పించారు. మేనిఫెస్టోను మాయం చేసిన ఘనుడు చంద్రబాబు అని అంబటి ఎద్దేవా చేశారు. సీట్ల ముష్టి కోసం చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్లారని అన్నారు. పవన్ ను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని సముద్రాన్ని ఈదినట్టేనని చెప్పారు. జనసేన కార్యకర్తలు ఇప్పటికైనా మేల్కోవాలని అన్నారు. 

జగన్ హామీలపై చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని అంబటి మండిపడ్డారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదని చెప్పారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రిగా చరిత్రలో జగన్ నిలిచిపోతారని అన్నారు. దుష్ట చతుష్టయం పన్నే పద్మ వ్యూహాలను ఛేదించి రాగల అర్జునుడు జగన్ అని కితాబునిచ్చారు. 

అన్యాయాలు, అక్రమాలు చేసిన బఫూన్ బాలశౌరి అని విమర్శించారు. టికెట్ రాలేదని పార్టీ మారుతున్నాడని దుయ్యబట్టారు. ఎవరికైనా నమ్మకద్రోహం చేసే వ్యక్తి  బాలశౌరి అని అన్నారు. నారా లోకేశ్ బయట ఉంటే టీడీపీ పని అయిపోతుందనే ఆయనను బయటకు రానివ్వడం లేదని ఎద్దేవా చేశారు.

Ambati Rambabu
Jagan
YSRCP
Chandrababu
Telugudesam
Pawan Kalyan
Janasena

More Telugu News